మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గుర్తుచేసుకున్నారు. పీవీ ఘాట్లో నివాళులు అర్పించిన అరవింద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పీవీ తనను రాజకీయాలలోకి రావద్దని సూచించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీవీ ఘాట్ను కూలకొడతామని ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే అంటే సీఎం మాట్లాడలేదని మండిపడ్డారు. పీవీ మీద దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని సీఎం కేసీఆర్ను విమర్శించారు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నయమని.. ఒకరిని జైల్లో పెట్టించారని ఎంఐఎం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతామన్నారు. పీవీ నరసింహారావును చూసి భారతీయత నేర్చుకోవాలని కేసీఆర్కు హితవు పలికారు. అటు…మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.