ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎండగట్టారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒకవైపు కోర్టు చీవాట్లు పెడుతున్నా ఒంటెద్దు పోకడలకు పోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాలు చేయాల్సిన అవసరం రాదనుకున్నామని అన్నారు.
కానీ తెలంగాణలో ఇంత దారుణ పరిస్థితులు ఉంటాయని ఎవరూ ఊహించలేదని వాపోయారు. చాలీ చాలని వేతనాలతో ఆర్టీసీ కార్మికులు గొడ్డు చాకిరీ చేస్తున్నారని సానుభూతి వ్యక్తం చేశారు. పోలీసులను ఉపయోగించి ప్రజల గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరించి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేదా అని ప్రశ్నించారు.