ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం ఆయా పార్టీలు జేయేసీగా ఏర్పడి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విషయం పై ఏపీ మంత్రి కన్నబాబు టీడీపీపై విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ ఉద్యమాలు అంటూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు.
గతంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లేనిపోని అపోహలు కల్పించి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికల గురించి చర్చిస్తున్నామని చెప్పారు.