telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దేవుడి దయ వుంటే మళ్లీ కేబినెట్‌లో ఉంటా -బొత్స ఆశాభావం

*మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు
*దేవుడి దయ వుంటే మళ్లీ 24 మందిలో వుంటా..
*కేబినెట్ లో ఎవ‌రిని కొనసాగించాలన్నది సీఎం జగన్‌ ఇష్టం
*విశాఖ భూముల్లో త‌ప్పంతా చంద్ర‌బాబుదే..

కేబినెట్ లో ఎవ‌రిని కొనసాగించాలన్నది సీఎం జగన్‌ ఇష్టమ‌ని, ఆయ‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఉంద‌ని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీకరణ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ వుంటే మళ్లీ 24 మందిలో వుంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఏ బాధ్యత ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

మంత్రులంద‌రూ పూర్తి సంతోషంతోనే రాజీనామాలు చేశార‌ని బొత్స స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామ‌ని అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని స‌మ‌న్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామ‌న్నారు.

మంత్రిగా ఉన్న.. పార్టీలో ఉన్న ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై సీఎం ప్రణాళిక ఇస్తారు. పాత కేబినెట్ మాదిరిగానే కొత్త మంత్రి వర్గంలో సామాజిక సమీకరణాలు ఉంటాయి’ అని మంత్రి బొత్స అన్నారు. రెండున్నరేళ్ల త‌ర్వాత కేబినెట్ పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని సీఎం జగన్ మొద‌ట్లోనే చెప్పార‌ని, అదే విధంగా సీఎం జ‌గ‌న్ ఇప్పుడు కొత్త కేబినెట్‌ను తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.

విశాఖ భూములపై టీడీపీ ఆరోపణలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తప్పుబట్టారు. ఎన్‌సీసీ భూములపై 2019లో మాజీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లో పెట్టారని తెలిపారు. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు జీవో ఇచ్చారని విమర్శించారు. విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదేనని బొత్స సత్యనాయణ ఆరోపించారు.

Related posts