హైటెక్సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్నితెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు. కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా మరో 1.5 కి.మీ. మార్గం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. హైటెక్సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో మైండ్ స్పేస్ వరకు మెట్రో రైల్ రాకతో ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యం లభించనుంది.