ఉక్రెయిన్లో రష్యా యుద్ధం కారణంగా చనిపోయిన భారతీయ ఎంబీబీఎస్ విద్యార్థి నవీన్ మృతదేహం.. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు బెంగళూరు చేరుకుంది. నవీన్ పార్థివదేహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు.
21 ఏళ్ల నవీన్ కర్ణాటకలోని హవేరీ జిల్లా నివాసి.దాదాపు మూడు వారాల కిందట నవీన్ చనిపోగా, భారత్కు తీసుకురావడానికి ఇన్ని రోజులు పట్టింది. నేటి ఉదయం బెంగళూరులోని కెంపే గౌడ ఎయిర్పోర్టుకు నవీన్ పార్థివదేహం చేరుకుంది. ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లిన నవీన్ ఖార్కీవ్లో నివాసం ఉంటున్నాడు.
అయితే దురదృష్టవశాత్తూ ఖార్కీవ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో మార్చి 1న కర్ణాటకకు చెందిన నవీన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎలాగైనా సరే నవీన్ మృతదేహాన్ని భారత్కు తీసుకురావాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఉక్రెయిన్ అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, అధికారులు మాట్లాడి నవీన్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చారు. తమ కుమారుడి మృతదేహాన్ని పరిశోధనల కోసం దేవనాగరెలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి దానం చేయాలని నవీన్ కుటుంబం నిర్ణయం తీసుకుంది.
నవీన్ మృతదేహాన్ని తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.