ఇటీవలే మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపుతూ రూలింగ్ ఇచ్చారు. ఒక వైపు తప్పు అని చెబుతూనే…మరోవైపు సెలెక్ట్ కమటీకి పంపాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నారు. నేరుగా శాసనసభా వేదికగా మండలిలో జరిగిన పరిణామాల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు మండలి అవసరమా అనే చర్చ తీసుకొచ్చారు. దీని పైన సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఇదే సమయంలో సోమవారం ఉదయం కేబినెట్ కు నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు మండలిని రద్దు చేయకుండా ఆపుకొనే ఉద్దేశంతో కొందరు మధ్యవర్తులు ముందుకు వచ్చారు. వైసీపీ నేతలతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ ముఖ్య నేతలు మాత్రం మండలిలో జరిగిన పరిణామాలను తీవ్రంగా పరిగణించారు. మండలి రద్దు చేయకూడదంటే షరతులు తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన ఇప్పుడు చర్చ మొదలైంది.
ప్రస్తుత ఛైర్మన్ షరీఫ్ ను ఇక ఆ హోదాలో మాత్రం కొనసాగకుండా చూడాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. తాము అనుకున్న సభలో మద్దతు కూడగట్టలేక పోతే మాత్రం రద్దు ఖాయమంటూ స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలు తమతో కలిసి వస్తే..రద్దు ప్రతిపాదన పక్కన పెడతామనే సంకేతాలిస్తున్నారు. అందులో భాగంగా..ప్రస్తుత ఛైర్మన్ పైన అవిశ్వాసం పెట్టటం లేదా..ఆయన్ను రాజీనామా చేయమని కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో వైసీపీ ఎమ్మెల్సీని ఛైర్మన్ ను చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశం అయ్యే సమయానికి తాము అనుకున్న విధంగా పట్టు దొరికితే..నిర్ణయం మార్చుకోవటం లేదంటే..అదే కేబినెట్ సమావేశంలో మండలి రద్దు నిర్ణయం తీసుకోవాలనేది వైసీపీ వ్యూహం గా కనిపిస్తోంది. దీంతో..మండలి రద్దు పైన తుది నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ సభ్యుల్లో కొనసాగుతోంది.