సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు ముగిసింది. నగరి మినహా అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు దాదాపుగా ఓ అభిప్రాయానికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం మంగళవారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో చర్చించేందుకు ఆహ్వానించడంతో కుప్పం, పలమనేరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, చిత్తూరు, నగరి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి నుంచీ పెద్ద సంఖ్యలో నేతలు తరలివెళ్ళారు.
చిత్తూరు ఎంపీ, కుప్పం, పలమనేరు, చంద్రగిరి గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. చిత్తూరు ఎంపీగా మళ్ళీ శివప్రసాద్, కుప్పం నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలమనేరు నుంచీ మంత్రి అమరనాధరెడ్డి, చంద్రగిరి నుంచీ పులివర్తి నానీ పోటీ చేస్తారన్నది ఎప్పుడో ఖరారైపోయింది. నగరి నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక పై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. నగరి సీటును గాలి ముద్దుకృష్ణమ నాయుడు పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఆశిస్తుండగా అతనికి కుటుంబసభ్యులే వ్యతిరేకంగా వున్నట్లు తెలుస్తోంది.
ముద్దుకృష్ణమ సతీమణి, ఎమ్మెల్సీ సరస్వతమ్మ, చిన్న కుమారుడు జగదీష్ సహా నియోజకవర్గంలోని ముఖ్యనేతలంతా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీల ఛైర్మన్ కొండూరు అశోక్రాజుకు మద్దతుగా నిలిచారు. నగరి అసెంబ్లీ టికెట్ మాత్రం ముద్దుకృష్ణమ కుటుంబీకుల్లో ఒకరికి లేదా అశోక్రాజుకు టికెట్ కేటాయించే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరికనేది టీడీపీ అధిష్ఠానం నిర్ణయించాల్సి ఉంది.
తన జీవితం ప్రజలకే అంకితం: కవిత