సీనియర్ హీరో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు.
కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేశ్బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
కృష్ణ-ఇందిర దంపతులకు తొలి సంతానంగా జన్మించిన రమేశ్ బాబు అక్టోబర్ 13, 1965 చెన్నైలో జన్మించారు. 1974లో తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రం ద్వారా బాలనటుడుగా వెండితెరకు పరిచయం అయిన రమేశ్బాబు “సామ్రాట్” సినిమాతో హీరోగా మారారు.
కృష్ణ, మహేశ్బాబుతో కలిసి సుమారు 15 చిత్రాల్లో నటించారు. దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు, నీళ్లు, చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, శాంతి ఎనతు శాంతి, నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, అన్నా చెల్లెలు, పచ్చ తోరణం ఎన్ కౌంటర్ వంటి చిత్రాలతో మెప్పించారు.1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్బాబు 2004 లో నిర్మాతగా మారారు. ‘అర్జున్’, ‘అతిథి’ సినిమాలు నిర్మించారు.
రమేష్ బాబు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కాగా.. అయితే, రమేష్ బాబు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అభిమానులు తరలివస్తున్నారు.. ఈ నేపథ్యంలో అభిమానులకు ఘట్టమనేని ఫ్యామిలీ ఓ విజ్తప్తి చేసింది.
రమేష్బాబు మరణించారని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాం అంటూ.. ఆ ప్రకటనలో పేర్కొంది ఘట్టమనేని ఫ్యామిలీ..
అందుకే చెయ్యి కోసుకున్నా… బిగ్ బాస్ కంటెస్టెంట్ వ్యాఖ్యలు