తమిళ బిగ్బాస్ సీజన్-3లో పాల్గొన్న మధుమిత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చదివిన తమిళ కవిత వివాదాస్పదంగా మారింది. బిగ్బాస్ హౌస్లో సినీ దర్శకుడు చేరన్, నటి కస్తూరి మినహా మిగిలిన ఎనిమిది మంది హౌస్మేట్స్ తనను చిత్రహింసలకు గురిచేశారని తమిళ సినీ హాస్యనటి మధుమిత ఆరోపించారు. హౌస్లో రాజకీయాలు ప్రస్తావించకూడదనే నిబంధనను ఉల్లఘించావంటూ ఆ ఎనిమిదిమందీ తనను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆ కారణంగానే తాను కత్తితో చెయ్యి కోసుకున్నానని ఆమె తెలిపారు. చెన్నైలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాలు లభించడం లేదని, కనీసం వానలు కూడా కురవడం లేదన్న భావంతోనే ‘వరుణ దేవుడా తమిళనాడుపై ఎందుకు కరుణించవు?’ అంటూ పద్యాలు పాడానన్నారు. దీనికే వారంతా తనపై విరుచుకుపడి వేధింపులకు గురిచేశారన్నారు. తాను చెయ్యి కోసుకున్నా ఆ ఎనిమిదిమందీ పట్టించుకోకుండా మరింత హేళనగా ప్రవర్తించారని ఆరోపించారు. వ్యాఖ్యాతగా ఉన్న కమల్హాసన్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోను పూర్తిగా చూసినా న్యాయానికి అండగా నిలువలేదని మధుమిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే మధుమితను హౌజ్ నుంచి ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే.