భారతరత్న గానకోకిల లతా మంగేష్కర్ పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 28). 1929లో జన్మించిన ఆమె ప్రస్తుతం 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. సినీ నేపధ్య గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారులతామంగేష్కర్. లతా మంగేష్కర్ ఈ పేరు తెలియని సంగీతాభిమానులుండరు. ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్..అమె గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.
దాదాపుగా అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. తన కెరీర్లో 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కూడా పాడారు. 1955లో ఏయన్నార్ హీరోగా రూపొందిన సంతానం చిత్రంలో లతా మంగేష్కర్ తొలిసారి తెలుగు పాట పాడారు. ఆ తరువాత నాగార్జున హీరోగా రూపొందిన ఆఖరిపోరాటంలో పాడారు .
గాన కోకిల జర్నీ..
తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కు లతా మంగేష్కర్ తల్లి రెండో భార్య. తండ్రి సుప్రసిద్ధ సంగీతకారుడు. ఈ దంపతులకు లత 1929 సెప్టెంబరు 28 న జన్మించారు. లతా మంగేష్కర్ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు. ఆశా భోంస్లే కూడా ప్రముఖ నేపధ్య గాయని. లత తండ్రి, దీనానాథ్ మంచి క్లాసికల్ సింగర్. దీంతో లతా చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. లతా కుటుంబమంతా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో అందరూ సంగీతంలోనే స్థిరపడ్డారు.
నిజానికి లత పుట్టిన సమయంలో పెట్టిన పేరు హేమ.. అయితే తండ్రి నటిస్తున్న “భవ బంధన్” నాటకంలో లతిక అనే పాత్రలో నటించారు. అప్పటి నుంచి హేమ పేరు లత గా మారిపోయింది. లతా మంగేష్కర్ గా ప్రఖ్యాతి గాంచారు. లత తన ఐదేళ్ల వయసు నుంచే నాటకాల్లో నటించడం.. పాటలు పాడడం మొదలు పెట్టారు.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన లత అక్కడ 16 ఏళ్లుమాత్రమే ఉన్నారు. లత జీవితంలో ఎక్కువకాలం ముంబైలో గడిపారు.
1942లో ఆమె తండ్రి దీనానాథ్ గుండెజబ్బుతో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి. 1942 లో మరాఠీ చిత్రం కిటి హసల్ సినిమాలో లత మొదటి పాటను పాడారు. అయితే ఆ పాట సినిమా నుంచి కట్ చేశారు. దీంతో ఎప్పటికీ ఆ పాట రిలీజ్ కాలేదు. లతా మంగేష్కర్.. ఆనంద్ఘన్ అనే పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు.
ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు గులామ్ హైదర్ను తన గాడ్ ఫాదర్గా భావిస్తారు. లతా సంగీత ప్రతిభపై విశ్వాసం చూపించడమే కాదు.. ఎన్నో అవకాశాలు ఇచ్చారు. హిందీ చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకులందరితో పాట పాడిన ఘనత ఆమె సొంతం. సినీ నేపథ్య గానంలో శిఖరాగ్రాన చేరిన లతాజీకి ‘మహాల్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆగ్’, ‘శ్రీ 420’, ‘చోరి చోరి’, ‘హైవే నెంబర్ 44’, ’దేవదాస్’ వంటి చిత్రాలు లతాజీని బాలీవుడ్లో తిరుగులేని గాయనిగా నిలబెట్టాయి. 1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన ‘మొఘల్-ఏ-ఆజమ్’ సినిమాలో పాడిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా పాట’ లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చింది.
సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన లతాజీ 1990లో సొంత ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. ఈ సంస్థ గుల్జార్ దర్శకత్వంలో ‘లేఖిని’ మూవీ తీశారు. ఈ మూవీలో పాడిన పాటకు గానూ లతాజీకి నేషనల్ అవార్డు వరించింది.లతా మంగేష్కర్ మొదటి సారి తెలుగులో పాడిన పాట తెలుగు ప్రేక్షకుల్ని అలరిచింది.
అంతేకాకుండా..జనవరి 27, 1963 న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్లో లతా పాడిన “ఏ మేరే వతన్ కే లోగాన్” దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ పాట 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు.
అమరవీరులను నివాళులర్పించడమే కాదు.. దేశభక్తి గీతం ‘‘వందేమాతరం’’ కూడా అంతే పాపులరిటీని సంపాదించింది.రెహ్మన్ మ్యూజిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ గీతం దేశభక్తి గీతాల్లో టాప్ రేంజ్లో నిలిచింది. దేశభక్తి గీతాలను ఆలపించడంలో కూడా లతాజీ తనకు తానే సాటి అనిపించుకున్నారు.
ఇక అవార్డుల విషయానికొస్తే.. భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న గాయకురాలు లతా మంగేష్కర్..
పద్శభూషణ్ (1969)
దాదా సాహెబ్ ఫాల్కే (1989)
మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997)
ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
రాజాలక్ష్మీ అవార్డు (1990)
పద్శవిభూషణ్ (1999)
భారతరత్న (2001)
ది లీజియన్ అఫ్ హానర్ (2006)
ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009)
అప్సరా అవార్డు
కాళిదాస్ సమ్మాన్ అవార్డు
తాన్ సేన్ అవార్డు
నేపాల్ అకాడమీ అవార్డు
సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు.
ఆ మధుర గాయని గురించి ఎన్ని చెప్పినా ఇంకా ఏదో మిగిలే వుంటుంది. అదే లతా మంగేష్కర్ గాన మాధుర్యంలో ఉన్న గొప్పతనం. సినీ సంగీతంలో తన గళంతో ఎన్నో అద్బుతాలు చేసిన ఈ మ్యూజిక్ లెజెండ్కు మరోసారి నవ్యమీడియా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.