telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారని తెలిసి సంతోష పడుతున్నా… ఎస్పీ బాలు ఆరోగ్యంపై రజినీకాంత్

Rajinikanth

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలు ఆరోగ్య పరిస్థితిపై రజినీకాంత్ స్పందిస్తూ.. ”ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారని తెలిసి సంతోష పడుతున్నా. గానగాంధర్వుడు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి తన వాయిస్‌తో మనందరినీ అలరించాలని కోరుకున్నాను” అన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు. కాగా గత రెండు రోజుల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు, తమిళ సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందిస్తూ.. ప్రస్తుతం నాన్న డాక్టర్లకు థంబ్స్‌అప్ చూపిస్తున్నారని, డాక్టర్లను గుర్తుపడుతున్నారని తెలిపారు. బాలు ఇంకా లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారని, కాస్త మెరుగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారని చరణ్ వెల్లడించారు. మెల్లగా తన తండ్రి ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన పేర్కొన్నారు. చివరగా ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిపారు. బాలు సతీమణి సావిత్రి కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే బాలు ఉన్న ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె కూడా కోలుకుంటోందని ఎస్పీ చరణ్ తెలిపారు. ఆగష్టు 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన కరోనా చికిత్స పొందుతున్నారు.

Related posts