తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
భరతమాత ముద్దుబిడ్డను కడసారి కళ్లారా వీక్షించేందుకు.. జనం భారీగా తరలివచ్చారు. సూమారు 30 కిలో మీటర్ల మేర సాగినీ భారీ ర్యాలీలో దారిపొడవునా యువత, విద్యార్ధులు సాయితేజకు పుష్పాంజలి ఘటించారు. జాతీయ జెండాలు చేతపట్టి… జై జవాన్ నినాదాలతో సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆ తరువాత సాయితేజ పార్థివదేహం ఇంటికి చేరడంతో గ్రామంలో విషాధం అలుకుముంది. గత నాలుగు రోజులుగా కడసారి చూపుకోసం నిరీక్షించిన కుటుంబసభ్యులు సాయితేజను మోసుకొచ్చిన పెట్టెను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు.
భర్తను ఆస్థితిలో చూసిన భార్య శ్యామలా… సొమ్మసిల్లి పడిపోయింది. సాయితేజ భార్యను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. జనవరిలో వస్తానన్న భర్త మృతుడై రావడంతో ఆమె తట్టుకోలేక పోయింది. ఏం జరుగుతుందో కూడా తెలియని సాయితేజ పిల్లలు ధీనంగా కనిపించారు. నిర్జివంగా పడి ఉన్న కొడుకును చూసి.. సాయితేజ తండ్రి, తల్లి గుండెలు బాదుకుని రోదించారు .
ఎగువరెగడ మైదానంలో ఉంచిన సాయితేజ పార్థివదేహానికి చూడడానికి సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయి తేజ అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఆనంతరం అశ్రునయనాల మధ్య . సాయి తేజ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తమిళనాడులో సల్లూరు ఎయిర్బేస్ నుంచి వెల్లింగ్టన్ లోని ఆర్మీ కాలేజీకి ఎంఐ హెలికాప్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మందిసైనికాధికారులు ప్రయాణం చేస్తుండగా కూనూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయింది.
ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి లాన్స్నాయక్ సాయితేజ అమరుడైయ్యాడు . కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన రైతు మోహన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సాయితేజ (29), చిన్న కుమారుడు మహేష్ బాబు (27). సైన్యంలో చేరి.. దేశసేవ చేస్తానని బాల్యం నుంచే సాయితేజ కుటుంబసభ్యులు, బంధువులకు చెప్పేవారు. తిరుపతి ఎంఆర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్ పూర్తి చేశారు. మదనపల్లెలో డిగ్రీలో చేరి రెండు నెలలు సెలవు పెట్టి గుంటూరులో ఆర్మీకి సన్నద్ధమయ్యారు. కొన్నినెలలకే సైన్యంలో సిపాయిగా అవకాశం వచ్చింది.