పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరితరమూ కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు తెలిపారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలోనే అనుమతులు అన్నీ వచ్చేశాయని చెప్పారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టును ఆపాలనుకున్నా అది కుదరదని వ్యాఖ్యానించారు. దేశంలో మరే జాతీయ ప్రాజెక్టుకు లేనివిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని తాము తీసుకొచ్చామని తెలిపారు.
ఏపీ మంత్రి దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలు తనను విమర్శించడంపై తీవ్రంగా స్పందించారు. నేనెలా అడ్డుపడ్డానో వాళ్లంతా సమాధానం చెప్పాలని అన్నారు. మెయిన్ డ్యామ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. . వీళ్ల చేతకానితనానికి ఇతరులను నిందిస్తే ఎలా? అని నిలదీశారు. విజయవాడలో గత ఐదేళ్లుగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని దద్దమ్మలు అక్కడి ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ సహా పోలవరానికి అన్ని అనుమతులు తీసుకొచ్చిన నన్ను బాధ్యుడిని చేసి విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.