వేడెక్కి.. చల్లారి.. మళ్ళీ రాజుకుందా .. అన్నట్టే ఉంది ఈ ఉత్తర కొరియా-అమెరికా మధ్య చర్చలు. తాజాగా, నూతన ఆంగ్లసంవత్సరాది సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగిస్తూ… తమపై ఆంక్షలను కొనసాగిస్తే, తాము మరో దారి చూసుకోక తప్పదని అమెరికాను హెచ్చరించారు. అంతర్జాతీయ సమాజం ముందు తమకు ఇచ్చిన హామీని అమెరికా నిలబెట్టుకోవాలని కోరారు, లేని పక్షంలో… తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాటానికి తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
అగ్రరాజ్యం సరిగా స్పందిస్తేనే … డీన్యూక్లియరైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతుందని కిమ్ తెలిపారు. ప్రపంచానికి మేలు కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరిపేందుకు తాను ఏ క్షణమైనా సిద్ధమేనని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా తమపై ఒత్తిడిని కలిగించవద్దని తెలిపారు. అమెరికాతో కలసి సంయుక్త మిలటరీ డ్రిల్స్ ను నిర్వహించవద్దని ఈ సందర్భంగా దక్షిణకొరియాను కిమ్ కోరారు. కొరియా ద్వీపకల్పంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఉత్తర, దక్షిణ కొరియాలు పలు కోణాల్లో చర్చలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో ఉత్తర, దక్షిణ కొరియాలు ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.