హిందువులకు కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో దీపాలు పెట్టి శివారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో ఉంది. కార్తీక మాసంలో ప్రదోషకాలంలో చేసే శివారాధన అనంతకోటి పుణ్య ఫలాల్ని అందిస్తుందట. కార్తీకమాస ఉపవాసాల వల్ల ఆరోగ్యం, దైవచింతన వల్ల శుభం జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
అత్యంత మహిమాన్విత మైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారు మోగిపోతాయి. శివ,పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు.
ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి కోరికలను తీరుస్తాడన్నది భక్తుల నమ్మకం.
శివునికి అలంకారాలతో నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం.
కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ఉసరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు ప్రదోష కాలంలో దేవాలయం/ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి.
తులసి పూజ..
తులసి విష్ణువుకు చాలా ప్రియమైంది. కార్తీకమాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం చెబుతుంది.. బ్రహ్మ ముహూర్తంలో ఈ మాసంలో స్నానం చేసి, తులసి పూజ చేయడం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది. .అందుకే ఈ మాసం తులసిమాతకు కూడా ప్రత్యేకం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. తులసి దగ్గర హరిపూజ పుణ్యప్రదం.
ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది.
కార్తీక మాసంలో నదీస్నానం
ఈ మాసం లో సూర్యోదయానికి ముందే నదీస్నానం, సముద్రం స్నానం చేస్తే అత్యంత ఫలప్రదం. ఈ మాసంలో స్నానం, దానం, దీపం, జపం, అభిషేకం చేయడం తప్పనిసరి. శక్తిమేరకు దానం చేయాలి. ఆ తర్వాత ఒకపూట భోజనంతో ఉపవాసం పాటించాలని స్కంధ పురాణం చెప్తోంది.
కార్తీక మాసంలో దీప దానం ..
కార్తీక మాసంలో దీప దానం అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఈ మాసంలో శరద్ పూర్ణిమ నుండి ప్రారంభించి ప్రతిరోజూ దీపదానం చేస్తారు. దీపాన్ని దానం చేయడం ద్వారా, ఇంటి చీకటి మాత్రమే కాకుండా, జీవితంలోని చీకటి కూడా తొలగిపోతుందని నమ్మకం.