కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వెల్లువలా వస్తున్న ఫోన్ కాల్స్ తీవ్రం కావడంతో ఆయన మధ్యప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి అదేపనిగా వస్తున్న ఫోన్ కాల్స్ తో ఇబ్బందిగా ఉందన్నారు. ఈ కాల్స్ పై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తో మాట్లాడినా కాల్స్ మాత్రం ఆగడం లేదని దిగ్విజయ్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ స్విచాఫ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదని అన్నారు.
ఈ వ్యవహారంపై ఆయన ట్వీట్ చేస్తూ, ఆయా ఫోన్ నంబర్ల స్క్రీన్ షాట్లను కూడా పంచుకున్నారు. వాటిలో కొన్ని ఇంటర్నేషనల్ నంబర్లు కూడా ఉన్నాయి. దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు రామేశ్వర్ శర్మ స్పందిస్తూ, దిగ్విజయ్ సింగ్ బాధపడాల్సిన పనిలేదని తెలిపారు. దిగ్విజయ్ ఫోన్ కు వస్తున్న కాల్స్ ను తన ఫోన్ కు ఫార్వార్డ్ చేస్తే తాను చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఓట్ల కోసమే అలా చేస్తుంది.. ప్రియాంకపై స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు