పకడ్బంధీగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కరెంట్ మీటర్ల రీడింగ్ నమోదును తెలంగాణ డిస్కమ్ లు వచ్చే నెలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో మీటర్ రీడింగ్ ను చూసే సమయానికి స్లాబ్ మారిపోయి బిల్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం తెలంగాణ ఉత్తర డిస్కమ్ ఓ ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా మీటర్ రీడింగ్ ను ఫోటో తీసి పంపితే బిల్ జనరేట్ అవుతుందని డిస్కమ్ సీఎండీ అన్నమనేని గోపాలరావు వెల్లడించారు.
వినియోగదారులు పాత బిల్ వచ్చిన తేదీ నుంచి సరిగ్గా 30 రోజులకు రీడింగ్ ను ఫొటో తీసి పంపితే బిల్ వస్తుందని, దాన్ని ఆన్ లైన్ లోనూ చెల్లించవచ్చని సూచించారు. ఢిల్లీలో ఈ తరహా విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఆన్ లైన్ లో మీటర్ ఫోటో తీసి 7వ తేదీలోగా దాన్ని పంపించి డబ్బులు చెల్లిస్తే, ఒక శాతం రాయితీని, 8 నుంచి 14 లోగా చెల్లిస్తే అర శాతం రాయితీని కేజ్రీవాల్ ప్రభుత్వం అందిస్తోంది.