కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలను కలిసి ఈ విషయం పై చర్చించనున్నట్టు చెప్పారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరిస్తామని అన్నారు.
పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన నాయకులు ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చామని అన్నారు. ఇప్పుడు హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. డిసెంబరు 5న కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో 12 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు ఏహెచ్ విశ్వనాథ్, ఎంబీటీ నాగరాజులకు కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.