ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాల వలన ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు వేణు మాధవ్. చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు. వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ తమ కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడని, తనను బావా అని పిలిచేవాడని అన్నారు.”ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్ చేసి విష్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సమయంలో వేణుమాధవ్కి ఆరోగ్యం బాలేదట. కానీ ఆ విషయాన్ని ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేసి, ఎన్నికల్లో విజయం సాధించారు” అంటూ వేణు మాధవ్ చేసిన పనులను గుర్తు చేసుకున్నారు.
previous post