తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 8.45 గంటలకు తమకు కేటాయించిన సీట్లో విద్యార్థులు కూర్చోవాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షలకు అనుమతి ఉండదు.
నేడు ఇంటర్ మొదటి సంవత్సరం, రేపు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదేవిధంగా 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలకు రాష్ర్టవ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ ను నియమించారు. 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.