దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను కూడా వణికిస్తోంది.
గత పది రోజులుగా ప్రతిరోజూ 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 96,424 కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలను దాటిందని పేర్కొంది. 10,17,754 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు డిశ్చార్జ్ అయ్యారు.
నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు కరోనాతో కొత్తగా 1174 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 84,372 మంది బాధితులు చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 10,06,615 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్ ప్రకటించింది.