2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో 30% సిలబస్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలంగాణ ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. మొత్తం సిలబస్లో సబ్జెక్టులవారీగా కూడా 30% సిలబస్ కుదించామని తెలిపారు. జాతీయస్థాయిలోని జేఈఈ, నీట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని సైన్స్ సబ్జెక్టులో కూడా సిలబస్ తగ్గించామన్నారు.
ప్రతి సబ్జెక్టుపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రతిపాదనల మేరకు అవసరమైన సిలబస్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. అంతగా ప్రాధాన్యం లేని సబ్జెక్టులను ఈ ఏడాది వరకు తాత్కాలికంగా తొలగిస్తామని తెలిపారు. సాధారణ పరిస్థితులు వస్తే వచ్చేఏడాది నుంచి యథావిధిగా వందశాతం సిలబస్తో పాఠాలు బోధిస్తామని చెప్పారు. సిలబస్ కుదింపునకు సంబంధించిన ఆదేశాలు ఒకటి రెండురోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించారు.