telugu navyamedia
క్రీడలు వార్తలు

టీం ఇండియా పై‌ పాక్ ప్రధాని ప్రశంసలు…

Imran

భారత క్రికెట్‌ జట్టుపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా ప్రపంచ శ్రేణి జట్లలో అగ్రశ్రేణి జట్టని కొనియాడారు. భారత్‌లో ప్రాథమిక క్రికెట్ మౌలిక సదుపాయాలను కావల్సినంతగా మెరుగుపరచడంతో.. భారతదేశం ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. అలాగే తమ దేశంలోనూ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని పాక్‌ ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పాక్ జట్టు ప్రపంచ విజేతగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ప్రదర్శనను వీక్షించిన పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ‌ఖాన్‌ సోమవారం ఇస్లామాబాద్‌లో ఓ మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశాన్ని చూడండి. వారు ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా మారుతున్నారు. ఎందుకంటే.. వారు తమ క్రికెట్‌ నిర్మాణాన్ని మెరుగుపరుచుకున్నారు. సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ వారి కంటే మా దేశ క్రికెటర్లకే ఎక్కువ ప్రతిభ ఉంది. అయితే ఉత్పాదకత ఇచ్చే నిర్మాణం జరిగినప్పుడే ఫలితం పొందుతాం’ అని పాక్ ప్రధాని అన్నారు.

‘భారత్‌లో క్రికెట్‌ ఆటకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే వారు అగ్రశ్రేణి జట్టుగా మారుతున్నారన్నారు. పాకిస్తాన్‌లో క్రికెటర్లు చాలా ప్రతిభ కలిగి ఉన్నారు. అయితే ఉత్పాదకత లేని క్రికెట్ నిర్మాణం కారణంగా ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా అవతరించడం లేదు. ప్రతిభను ప్రకాశవంతం చేయడానికి సమయం పడుతుంది. మా జట్టు ప్రపంచ విజేతగా మారుతుందనే నమ్మకం ఉంది. దేశంలో ఇప్పుడు ప్రావిన్షియల్ క్రికెట్ నిర్మాణంతో ఫలితాలు రెండు, మూడు సంవత్సరాలలో వస్తాయి’ అని ప్రధాని ఇమ్రాన్‌ ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పోషకుడిగా, ఛైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌.. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆటకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ జట్టు దాదాపు దశాబ్దం క్రితం వరకు అగ్రశ్రేణి జట్టుగా ఉండేది. కాని ప్రస్తుతం అత్యుత్తమ జట్టు మాదిరిగా ఉండకపోవడం పాకిస్తానీయులను కలవరపెడుతున్నది. ప్రపంచ కప్‌లో భారతదేశంపై పాకిస్తాన్‌ జట్టు ఇంతవరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

Related posts