గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ చిన్న వ్యాపారస్థులకు ఊరట కల్పించింది. ఏడాదికి రూ. 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ మినహాయింపు రూ.20 లక్షలుగా ఉండేది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కంపోజిషన్ స్కీం కింద పరిమితిని రూ. 1.5 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీ వెల్లడించారు. గురువారం జీఎస్టీ కౌన్సిల్ 32వ సమావేశం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జైట్లీ మీడియాతో మాట్లాడారు.
గతంలో ఏడాదికి రూ.కోటి లోపు టర్నోవర్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ కంపోజిషన్ స్కీమ్లో చేరే అవకాశం ఉండేది. కంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్ను లెక్కించేటప్పుడు ఒకే పాన్ నంబర్తో రిజిస్టర్ అయిన అన్ని వ్యాపారాలను పరిగణలోకి తీసుకుంటారు. కంపోజిషన్ స్కీం కింద ఉన్న వాళ్లు మూడు నెలలకోసారి పన్ను చెల్లించినా.. రిటర్న్స్ మాత్రం ఏడాదికోసారి ఫైల్ చేసుకోవచ్చని జైట్లీ తెలిపారు.