విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా వేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అలా జరగలేదని తెలిపారు మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.
ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించామని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. ఈ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియాగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తామన్నారు.