telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు..-మాజీ ఎంపీ ఉండవల్లి సంచ‌ల‌న కామెంట్స్

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి  జగన్ పాలనలో ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఓట్లేసిన వాళ్లకు అన్నీ చేసేద్దామన్నారు. ఓట్లేయని వాళ్లను పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా జగన్ పాలన ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను వైసీపీ మోసం చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు

గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే ఉందని , సీఎంలు మారినా ఏపీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయన్నారు.

పోలవరం క‌ట్టే ఉద్దేశం కేంద్రానికి లేద‌ని..అడిగే ధైర్యం ఏపీలో పార్టీల‌కు లేద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. వీళ్లలో వీళ్లు తిట్టుకుంటారే కానీ బీజేపీని మాత్రం ఒక్కమాట కూడా అనరని ఉండవల్లి పేర్కొన్నారు.

పోలవరం డ్యామ్ నిర్మాణం చేయాలంటే.. పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పోలవరం ఎలాగో కాదని, ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు.

కేంద్రం క‌ట్టాల్సిన పోల‌వ‌రాన్ని చంద్ర‌బాబు ఎందుకు భుజాల‌కెత్తున్నార‌ని వైసీపీ ప్ర‌శ్నింద‌ని గుర్తుచేసిన ఆయ‌న‌..పోలవ‌రం ఎప్ప‌టికి పూర్త‌వ‌తుందో చెప్ప‌లేమ‌ని ఇప్ప‌టి ఇరిగేష‌న్ మంత్రి చెప్పారు. ఇందులో నిజ‌ముంద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు.వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కేంద్రానికి పోలవ‌రం బాధ్య‌త‌లు ఎందుకు అప్ప‌గించ‌లేద‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.

పోలవరం సహా విభజన హక్కులను సాధించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాన పార్టీల అధినేతల ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని.. హెరిటేజ్, భారతి సంస్థల హెడ్‌ ఆఫీసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. వారి ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయి కాబట్టే వైసీపీ, టీడీపీలు విభజన సమస్యలపై పోరాడలేకపోతున్నాయని ఆరోపించారు.

ఈ విషయాలన్నీ చాలా రోజుల నుంచి తాను చెబుతూనే ఉన్నానని.. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదని ఉండవల్లి అరుణ్ అన్నారు. అందుకే తాను ప్రెస్ కాన్ఫరెన్స్‌లు తగ్గించేశానని వివరించారు.

చంద్రబాబు హయాంలో కనీసం తనను విమర్శించడానికైనా మాట్లాడేవారని.. కానీ, ఇప్పుడు వైసీపీ వాళ్లు ఏం మాట్లాడడం లేదని నిట్టూర్చారు. అయితే, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలూ బీజేపీకి మద్దతిస్తున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆ పార్టీల నేతలు వాళ్లలో వాళ్లు తిట్టుకుంటారు కానీ.. బీజేపీని ఒక్క మాట కూడా అనరని వ్యాఖ్యానించారు.

Related posts