భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో నిరాశలో ఉన్న శాస్త్రవేత్తలకు సంఘీభావంగా ప్రధాని మోదీ ప్రసంగం చేశారు. చంద్రయాన్2కు చెందిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ చిక్కకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపించింది. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో భావోద్వేగ క్షణాలు కనిపించాయి.
ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మోదీ ప్రసంగించిన తర్వాత ఆయన వద్దకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని గాఢంగా హత్తుకున్నారు. భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే ఘన విజయాలకు ఇది బలమైన నాంది పలుకుతుందని చెప్పారు. ఎన్నో రాత్రులు అవిశ్రాంతంగా పనిచేస్తున్న సైంటిస్టులకు మోదీ జోహార్లు పలికారు.