telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ డెడ్‌లైన్..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కృష్టా బేసిన్ లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ అధికారులు పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం పేర్కొన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతి పై, పనులను మరింత వేగవంతం చేయడంపై, సీఎం ప్రగతి భవన్ లో ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ లక్ష్మారెడ్డి, శ్రీ మర్రి జనార్థన్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ అబ్రహం, శ్రీ అంజయ్య యాదవ్, శ్రీ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీ నరేందర్ రెడ్డి, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రాజేందర్ రెడ్డి, శ్రీ రామ్మోహన్ రెడ్డి, శ్రీ హర్షవర్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్, ఇఎన్సీ శ్రీ మురళీధర్ రావు, సలహాదారు శ్రీ పెంటారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఎస్.ఈలు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగులో పెట్టినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ పెండింగు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా మనం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నం. జూరాలతో సహా ఇప్పటికే మనం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని దక్షిణ పాలమూరు కు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం. ఇంకా వాటిల్లో కొరవలు (కొసరు పనులు) మిగిలినయి. వాటిని ఎట్లా అతి త్వరలో పూర్తి చేసుకుందామనే ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్ఫూర్తితో పనులు సాగాలె. ఏది ఏమయనా సరే, పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి చేసుకోవాలి..’’ అని సీఎం అన్నారు.

గోదావరి నదీ ప్రవాహానికి కృష్టా నదీ ప్రవాహానికి తేడా వుంటుందని, సముద్రుని వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే.. కృష్టా నదీ ప్రవాహం తగ్గుతూ వస్తుంటదని విశ్లేషించారు. రాను రాను వర్షాలు తగ్గిపోవడం దానికి తోడు కృష్టా నదిమీద ఎగువన కర్ణాటక మహారాష్ట్రలు నిర్మించిన ప్రాజెక్టులు, దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటు చేసిన తూముల వలన కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్కనీరు పోకుండా వడిసిపట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టా నదిమీది అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేసుకోవాల్సిందేనని సీఎం జల వనరుల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. కృష్టా జలాలను మలుపుకోని పాలమూరును పూర్తిస్తాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామన్నరు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే రైతన్నలకు వ్యవసాయ రంగానికి అంతమంచిదని, ఈ పథకాన్ని జూరాలకు లింక్ చేసుకోవచ్చని వివరించారు.

Related posts