నేడు ఏపీ కేబినెట్ భేటీకి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి రాష్ట్ర సీఎస్ తో కసరత్తు పూర్తిచేసి, మొత్తానికి ఎన్నికల సంఘం అధికారుల నుండి అనుమతులు పొందింది రాష్ట్ర ప్రభుత్వం. అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్నా, అనుమతి జారీ చేసే క్రమంలో ఈసీ పలు షరతులు కూడా విధించింది. ఓ దశలో ఈసీ అనుమతి సకాలంలో వస్తుందా? రాదా? అనే విషయంలో ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే అనుకున్న విధంగానే కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తన నిర్ణయం వెలువరించింది. ఈ సందర్భంగా, ఏపీ ప్రభుత్వానికి షరతులు కూడా విధించింది.
ఈసీ అనుమతి బకాయిల చెల్లింపులు, కొత్త నిర్ణయాలు అమలు చేసే ముందు తప్పనిసరి అంటూ స్పష్టం చేసింది. రేట్ల పెంపు, ఇతర నిర్ణయాలపై ఎలాంటి మీడియా ప్రకటనలు చేయరాదని తెలిపింది. కాగా, ఏపీ కేబినెట్ భేటీలో చంద్రబాబు సర్కారు ఫణి తుపాను, కరవు, తాగునీటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 10న కేబినెట్ భేటీ జరగాల్సి ఉన్నా, ముందస్తు అనుమతుల కోసం ఈ నెల 14కి వాయిదా వేశారు.