నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ 6వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు సీఎం జగన్. ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చిన సీఎం… రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తామని… విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని బేషరతుగా పార్లమెంటులో ప్రకటించారని గుర్తు చేశారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నానని తెలిపిన సీఎం జగన్… రివర్స్ పంపింగ్ టెక్నాలజీద్వారా మరో 33వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రివర్స్ పంపింగ్ టెక్నాలజీ ద్వారా విద్యత్ ఉత్పత్తి విషయంలో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నానని… 13 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నామని వెల్లడించారు సీఎం జగన్. భారత్నెట్ప్రాజెక్ట్ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలను చేపడుతుందని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదురకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఐదురకాల అంశాలు తయారీ రంగానికి అవరోధాలుగా మారాయని.. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండడం, భూ సేకరణలో ఆలస్యం కావడం, అనుమతుల మంజూరులో సంక్లిష్టత తదితర అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్సీ, మరియు ఆర్ఈసీ రుణలపై ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీలను చెల్లించాల్సి వస్తోందని..తయారీ రంగంలో ముందుంటున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3శాతానికి మించి ఉండటం లేదని తెలిపారు.
previous post
next post