telugu navyamedia
ఆంధ్ర వార్తలు

“జనవాణి – జనసేన భరోసా’’ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న‌

జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన “జనవాణి – జనసేన భరోసా’’ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ విజయవాడలో ప్రారంభించారు. ఆయనకు తమ సమస్యలు తెలియజేసి వినతిపత్రాలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుండి ఎంబికే భవన్ కు భారీసంఖ్యలో ప్రజలు, దివ్యాంగులు తరలివచ్చారు. వారినుండి వినతులు స్వీకరించిన పవన్ వాటి పరిష్కారానికి కృషిచేస్తాననిఅన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి భద్రత పేరుతో వైఎస్ జగన్ తాడేపల్లి నివాసానికి సమీపంలోని నిరుపేదల ఇళ్లను ఖాళీచేయించడాన్ని ప్రశ్నించిన ఓ వాలంటీర్ పై ఈ ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. దీంతో ఆమె కుటుంబంతో కలిసివచ్చి ప్రజల కోసం ప్రశ్నించినందుకే తమపై అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన చెందిందన్నారు.  ఈ ఫిర్యాదే జనవాణి ఏర్పాటుకు స్పూర్తి ఇచ్చిందన్న పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జగన్ నివాసం వద్ద ఇళ్లు తొలగిస్తే ఒక‌ చెల్లెమ్మ తనను కలిసిందని… అధికార పార్టీ నేతలు తన కుటుంబాన్ని‌ వేధిస్తున్నారని ఆవేదన చెందిందని పవన్ తెలిపారు. ఆ అమ్మాయి తన అన్నయ్య అనుమానాస్పద స్థితిలో మరణించాడంటూ కన్నీరు పెట్టుకుందని… ఆ సంఘటన తనను చాలా కదిలించిందన్నారు. తనను కలిసిన ఆ అమ్మాయి ఒక వాలంటీర్… ఆమె పరిస్ధితే ఇలావుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని పవన్ అన్నారు.

ఇలా ఎంతోమంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు… అలాంటి వారికోసమే ఈ జనవాణి కార్యక్రమం ఏర్పాటుచేసామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వారి వద్దే మేమే ‌వెళ్లి‌ కలుస్తున్నామన్నారు. జనసేన అధికారంలో‌ లేకున్నా సమస్యలు పట్ల సానుకూలంగా స్పందిస్తుందన్నారు.

ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల వద్దకు చేరుస్తామన్నారు. తద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Related posts