చైనా చర్యలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 మంది భారత జవాన్లపై చైనా సైనికులు దారుణంగా దాడిచేసి హతమార్చారని మండిపడ్డారు. చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు జవాన్ల మృతదేహాలకు అమరీందర్ సింగ్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయాలని మోదీ సర్కారుని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు.
భారత్ తీసుకునే ఈ చర్య వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అవి శాశ్వతంగా ఉండవని చెప్పారు. భారత్ కూడా చైనాకు ఏ మాత్రమూ తీసిపోని దేశమని చెప్పారు. 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తీరుపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని, చైనాలో తయారైన వస్తువులను బహిష్కరించాలని తాను మధ్యప్రదేశ్ ప్రజలను కోరుతున్నానని తెలిపారు.