రాజకీయాలకు వయసుతో నిమిత్తం లేదని రాజస్థాన్ లోని ఓ వృద్ధురాలు నిరూపించింది. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్ గా గెలుపొందింది. రాష్ట్రంలోని సికర్ జిల్లా నీమ్కా ఠాణా పరిధిలోని పురాణావాస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన 97ఏళ్ల విద్యాదేవి, తన సమీప ప్రత్యర్థి మీనాపై 207 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
దీంతో గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నికైన బామ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వయస్సులో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన బామ్మకు గ్రామ ప్రజలనుంచే గాక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తం 11మంది పోటీ చేయగా, విద్యాదేవి వైపే ఓటర్లు మొగ్గారు. విద్యాదేవి భర్త గతంలో గ్రామ సర్పంచ్ గా ఇరవై అయిదు సంవత్సరాలు పనిచేశారు.