telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఒకటి, రెండు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు: సీసీఎంబీ డైరెక్టర్

ఒకటి, రెండు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్ రావడం చాలా కష్టమని సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ పత్రికతో మాట్లాడిన ఆయన ఎంత భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసినా ఈ సంవత్సరం చివరిలోగా వ్యాక్సిన్ రావడం చాలా కష్టమని తెలిపారు. కరోనాకు వైరస్ కోసం ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.ప్రయోగాలు అత్యంత సమర్థవంతంగా జరిగితే మరో ఎనిమిది నెలల్లో వ్యాక్సిన్ వస్తుందని భావించవచ్చని అన్నారు.

జబ్బున పడిన వారికి మందుబిళ్ల ఇచ్చినట్టు ఇచ్చి, తగ్గిందా? లేదా? అని చూసేందుకు ఇదేమీ డ్రగ్ కాదని అన్నారు. వైరస్ శరీరంలోకి వస్తే, దాన్ని నిలువరించే యాంటీబాడీలను అంతకు ముందే సిద్ధం చేయాల్సిన వ్యాక్సిన్ అని ఆయన అన్నారు. అన్ని వయసుల వారికి, రుగ్మతలు ఉన్నవారికి కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా అనేది తేల్చడం కూడా కీలకమైన అంశమని అన్నారు.

వాస్తవానికి వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుందని తెలిపారు. కానీ, ప్రజలు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీ విజయవంతమైనా వచ్చే సంవత్సరం వ్యాక్సిన్ వస్తుందని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. తనకు అర్థమైనంత వరకూ అంతకన్నా ముందు మాత్రం వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

Related posts