తప్పుడు కథనాలు, అభ్యంతరకర పోస్ట్ ల పై చర్యలు తీసుకుంటామని మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అభ్యంతరకరమైన సమాచారాన్ని షేర్ చేసుకుంటే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇటీవలికాలంలో మీడియాలో ప్రకటనలు కూడా ఆ సంస్థ ఇచ్చింది.
తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ లో ఓ సభ్యుడు అభ్యంతరకరమైన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అడ్మిన్ స్పందించకపోవడంతో మరో సభ్యుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అడ్మిన్ తో పాటు సదరు చిత్రాన్ని పోస్ట్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరిలోని మౌలాలి షఫీనగర్కు చెందిన సిరాజ్ జొమాటో సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.
ఇతను లాయల్ పార్టనర్స్ ఎమలార్డ్ అనే వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ గ్రూపును కుషాయిగూడ నాగార్జున్నగర్కు చెందిన కమ్మంపల్లి వెంకటేశ్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 26న సిరాజ్ ఓ అభ్యంతరకరమైన ఫొటోను గ్రూపులో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని అడ్మిన్ పట్టించుకోలేదు.దీంతో ఇదే వాట్సాప్ గ్రూపులో ఉన్న తిరుమలేశ్వర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. సిరాజ్ పెట్టిన పోస్ట్ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సిరాజ్, వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు.