శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకోవడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టీటీడీ సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ ప్రారంభించింది. రోజుకు 8వేల సర్వదర్శనం టోకెన్లను మంజూరు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది .ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల కోసం ముందు రోజు సాయంత్రం నుంచే అక్కడ వేచి ఉండటంతో టోకెన్ల కోసం రద్దీ భారీగా పెరిగింది.
కరోనా ప్రభావం వల్ల సుమారు 5 నెలల తర్వాత టీటీడీ సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను ప్రారంభించింది. అంతకుముందు కేవలం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజలకు మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేశారు. ఆ సమయంలో భక్తులకు రోజుకు రెండు వేల టోకెన్లు ఇచ్చేవారు. భక్తులకు కరోనావైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనభాగ్యాన్ని కల్పిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుందంటూ భక్తులు కొనియాడుతున్నారు.
ఆధార్ కార్డు ఉన్న ప్రతి భక్తుడికి సర్వదర్శనం టోకెను పొందే అవకాశం కల్పించారు టీటీడీ అధికారులు. ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు అదే రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేయనున్నట్టు తెలిపారు.