కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కనబెట్టి బ్రీఫ్ కేస్కు బదులుగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆమె చాటిచెప్పారు. సాధారణంగా బడ్జెట్ ని బ్రీఫ్ కేస్ లో తీసుకువస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు తమకు నచ్చిన రంగు బ్రీఫ్ కేస్లో బడ్జెట్ ప్రతులను తీసుకువస్తారు.
ఆర్థికశాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్కు బయల్దేరిన నిర్మలా సీతారామన్ చేతిలో ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్శిల్ లాంటిది కన్పించింది. దానిపై రాజముద్ర కూడా ఉంది. సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎలాంటి బ్యాగ్ లేకుండా ఓ ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి బడ్జెట్ ని తీసుకురావడం విశేషం. దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ మరికాసేపట్లో వెల్లడికానుంది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.