బీహార్ లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకుంటోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి సీట్ల సర్దుబాటు చేసుకుంది. తాజాగా, జేడీయూ, బీజేపీ కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. బీహార్ లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా జేడీయూ 122, బీజేపీ 121 సీట్లల్లో పోటీ చేయనున్నాయి.
జితన్ రామ్ మంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి జేడీయూ కోటాలో సీట్లు ఇవ్వనున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ పలు సీట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నితిశ్ కుమార్, పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు మధ్య వచ్చిన విభేదాలు ఆ కూటమిని కాస్త ఇరుకున పెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది.