బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోదీ పభుత్వం రెండవసారి కేంద్రంలో కొలువుదీరిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు కమలం పార్టీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ బంగ్లాదేశ్ నటి అంజు ఘోష్ బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో బుధవారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియా సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.
ప్రస్తుతం బంగ్లాదేశీయురాలుగా కొనసాగుతున్నారా, లేక భారత పౌరసత్వం తీసుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు అంజూ స్పష్టత ఇవ్వలేదు. అంజూ 1989లో వచ్చిన హిట్ మూవీ బెడెర్ మెయ్ జోస్నాలో నటించారు. ఈ చిత్రం బంగ్లాదేశ్ సినీ చరిత్రలో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఆమె బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశారు.