కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు చేపట్టింది. రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తికి మరింత కట్టుదిట్టంగా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ప్రభుత్వం తాజాగా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది.
సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో రాష్ట్రానికి వచ్చిన ఈ కరోనా టెస్టింగ్ కిట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ టెస్టింగ్ కిట్లు 10 నిమిషాల లోపే ఫలితాన్నివ్వగలవని అధికారులు చెబుతున్నారు. వీటి సాయంతో ఏకకాలంలో వేలమందికి కరోనా టెస్టులు చేయవచ్చని అంటున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కొరియా టెస్టింగ్ కిట్లను చేరవేస్తామని అధికారులు వెల్లడించారు.