కరోనా మహమ్మారి కారణంగా ఓ ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ప్రస్తుతం తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ‘బాలికా వధు’ సీరియల్ దర్శకుల్లో ఒకరైన రామ్ వ్రిక్ష గౌర్ ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఓ సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసమని నేను అంజగఢ్ వచ్చాను. ఇంతలో లాక్డౌన్ విధించడంతో తిరిగి వెళ్లలేకపోయాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా పట్టాలెక్కడానికి సంవత్సరం పైగా పడుతుందని నిర్మాత చెప్పారు. దీంతో అప్పటివరకు ఖాళీగా ఉండటం ఇష్టంలేక నా తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నాను. అందువల్లే ఇలా తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్నాను. దీనికి నేను సిగ్గుపడటం లేదు” అని చెప్పుకొచ్చారు రామ్ వ్రిక్ష. తనకు ముంబయి నగరంలో సొంతిల్లు ఉందని, ఎప్పటికైనా అక్కడికి తిరిగి వెళ్లి సినిమాల్లో రాణిస్తానన్న నమ్మకం ఉందని రామ్ వ్రిక్ష ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు బ్రతుకు బండి నడిపేందుకే కూరగాయల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.
previous post
next post