telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఓ హీరో రామారావు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నాడు… కానీ చనిపోతే…” పవన్ పై శశివాజీరాజా వ్యాఖ్యలు

shivaji-raja

ప్రముఖ సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావు గారు మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు చిరంజీవి, నాని, నాగచైతన్య, వెంకటేష్ తదితరులు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేసారు. అయితే తాజాగా సినీ నటుడు శివాజీ రాజా… పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. 

“పసుపులేటి రామారావు గారు ఇంత త్వరగా వెళ్లిపోవడం ఏంటో నాకు అర్థం కావడంలేదు. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన సైకిల్‌పై తిరుగుతుంటే ‘వద్దు సార్.. మీకు అభ్యంతరం లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ తరఫున మీకు ఏదైనా బండి ఇప్పిస్తాను’ అన్నాను. అందుకు ఆయన వద్దన్నారు. 40 రోజుల క్రితం ఆయన మా ఇంటికి వచ్చారు. నా ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడే ఏకైక జర్నలిస్ట్ ఆయనే. మా ఇంట్లోవారికి కూడా ఆయనంటే గౌరవం. ఎందుకంటే వయసులో పెద్దవారనే కాదు, చాలా నిజాయతీ ఉన్న జర్నలిస్ట్. ఈ క్షణం నేను చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రామారావు గారు చనిపోయారు అని తెలీగానే వెంటనే ఆయన కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటానని అన్నారు. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఓ హీరో రామారావు తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నాడు. మరి ఆ హీరో రామారావు గారు బతికున్నప్పుడు ఆయనకేం చేసారో తెలీదు. చనిపోయాక ఆ హీరో ఎందుకు వచ్చి కనపడలేదో తెలీదు. చనిపోయాక కొన్ని పదాలు చాలా మంది సాధారణంగా వాడేస్తుంటారు. ఆయన లేని లోటు తీర్చలేనిది, ఆయనక సంతాపం తెలియజేస్తున్నాం.. ఇలాంటి పదాలు వాడేస్తుంటారు. నటీనటుల మధ్య ఐక్యత లేదని ఇన్నాళ్లూ అనుకున్నాను కానీ పాత్రికేయుల మధ్య కూడా ఐక్యత లేదయ్యా. పసుపులేటి రామరావు నీతి నిజాయతీ ఉన్న మనిషి. 40 ఏళ్ల పాటు మద్రాసు నుంచి ఆయన సేవలు అందిస్తుంటే ఇదేనా మీరు ఆయనకిచ్చే నివాళి. ఆయన ఫొటోపై అశ్రునివాళి అని రాసుంది. అది కరెక్ట్. నిజంగా ఆయన్ను మీరు ఏ రకంగా గౌరవించారో రామారావుగారు చూస్తే నిజంగానే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారు. 80ల కాలంలో వచ్చిన నాలాంటి నటుల గురించి పత్రికల్లో చాలా బాగా రాసి మాకంటూ గుర్తింపు వచ్చేలా చేసారు రామారావుగారు. నాలాంటి వాళ్లు ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ మహానుభావుడి వల్లే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడే వయసు లేదు, ఆ అలవాటు కూడా లేదు. నేను రామారావుగారి కుటుంబానికి ఒక్కటే చేయగలను సినీ రంగానికి సంబంధించినవారు ఎవరు చనిపోయినా నాలుగు, ఐదు లక్షలు సేకరించి, వారి కుటుంబాలకు విరాళంగా ఇస్తుంటాను. ఇప్పుడు కూడా అదే చేయాలని అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా కూడా నాలాంటి అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారు” అని అన్నారు. శివాజీ రాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామారావు గారితో అనుబంధం ఉంది, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని సంతాపం తెలిపింది పవన్ మాత్రమే. కానీ రామారావు భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి మాత్రం పవన్ రాలేదు.

Related posts