ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టు చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నియమ నిబంధనలు.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 330 కోట్ల ఆర్థిక భారం పడనుందని, దానిని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వెల్లడించారు.