ఏపీ సీఎం జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంభోదిస్తున్న తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏకవచనంతో చంద్రబాబు సంభోదిస్తారా? ఏమైపోయింది మీ సంస్కారం? ఇలాంటి భాష మాట్లాడటం న్యాయమేనా? అని ప్రశ్నించారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు మాట్లాడే తీరు ఇదేనా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మైండ్ సెట్ మారనట్టు ఉందన్నారు . ఆయన వయసుకు ఉన్న గౌరవాన్ని కూడా రోజురోజుకీ తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ముందుకు, మీడియా ముందుకు వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలని, ఆ హుందాతనం బాబులో కనిపించడం లేదని బొత్స విరుచుకుపడ్డారు.