సొంత పార్టీలోని వ్యక్తులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ ఆనందాన్ని పొందలేదని ఆమె వాపోయారు. ఆడపిల్లనైన తాను నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని అన్నారు. తన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడవాలనుకుంటున్నవారి అంతు చూస్తానని హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీతో, మాజీ మంత్రితో ఎంతవరకైనా పోరాడవచ్చని కానీ, సొంత పార్టీ వ్యక్తులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని ఆమె వాపోయారు. చిలకలూరిపేటలో అవినీతి గద్దలను తరిమేయాలనే లక్ష్యంతో జగనన్న స్థాపించిన వైసీపీలో చేరానని, కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయాని రజని మండిపడ్డారు. మనలో నిజాయతీ ఉంటే గెలుపు తథ్యమనే నిజాన్ని మొన్నటి ఎన్నికలు నిరూపించాయని చెప్పారు.