మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్ మళ్లీ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. నెల రోజుల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్షకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ముందే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవీస్ రాజీనామా కంటే ముందే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం ఎన్సీపీ కూటమి సారథ్యంలో ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నాడు డిప్యూటీ సీఎంగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరనే అంశంపై కాస్త స్పష్టత వచ్చింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ ల మధ్య జరిగిన సమావేశంలో అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.