నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా, అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా
సంగీతం: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం : జూలియస్ పేకియం
ఛాయాగ్రహణం : రత్నవేలు
నిర్మాత: రామ్చరణ్
“ఖైదీ నెంబర్ 150″తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుని తనకు ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వివాదాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ :
ప్రథమ స్వాతంత్య్ర సమరం కంటే ముందు 1847లో బ్రిటీష్ వారు పరిపాలనలో ఉన్న ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ఉండేవారు. అందులో నరసింహారెడ్డి కూడా ఓ పాలెగాడు. రాయలసీమలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు నరసింహారెడ్డి (చిరంజీవి). తీవ్రమైన కరువు వచ్చినప్పుడు బ్రిటీష్వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులను పన్నులు కట్టమని వేధించడం మొదలు పెడతారు. గురువు గోసాయి ఎంకన్న(అమితాబ్ బచ్చన్) స్ఫూర్తితో బ్రిటీష్వారు చేసే అకృత్యాలు చూడలేక నరసింహారెడ్డి వారికి ఎదురు తిరుగుతాడు. బ్రిటిష్ ప్రభుత్వంపై పగతో రగిలిపోయే నర్సింహారెడ్డి తన చుట్టుపక్కల రాజ్యాల్లో రాజులను కలుపుకుని మళ్లీ బ్రిటిష్ వారిపై యుద్ధానికి దిగుతారు. ఈ క్రమంలో అవుకు రాజు (కిచ్చాసుదీప్), రాజా పాండి (విజయ్ సేతుపతి), వీరా రెడ్డి (జగపతిబాబు) తదితరులు నరసింహారెడ్డికి అండగా నిలుస్తారు. ఈ యుద్ధంలో ఏం జరిగింది ? సినిమాలో అనుష్క పాత్ర ఏంటి ? నరసింహారెడ్డి భరతమాత దాస్య సంకెళ్ళు తెంచాడా ? ఈ యుద్ధంలో బ్రిటీష్ వారిని ఎదుర్కోగలిగాడా ? నరసింహారెడ్డిని ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారు ఎలాంటి పన్నాగాలు పన్నారు ? చివరకు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
సినిమాలో ఉన్న నటీనటులంతా ఇప్పటికే నటనలో లెజెండ్స్ గా ఉన్నారు. వారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోని భారీ తారాగణం నటన గురించి అందరికీ తెలిసిందే. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఒదిగిపోయారు. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోతారు. ఇక అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార, బ్రహ్మానందం, నిహారిక తదితరులు తమతమ పాత్రల్లో తమదైన శైలిలో నటించి అదరగొట్టారు.
సాంకేతిక వర్గం పనితీరు :
స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెలను హత్తుకుంటాయి. సినిమాలో చిరు ఎంట్రీ సీన్ ను హైలెట్ గా తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలు సైతం పతాక స్థాయిలో తెరకెక్కించారు. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు సాగదీసినట్లుగా అన్పిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.
రేటింగ్ : 3/5