తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరి కంటే సీనియర్ తానే అని… తనకన్నా విధేయుడు ఎవరున్నారని ప్రశ్నించారు. పీసీసీ పదవి ఎప్పుడూ ఒకే సామాజికవర్గానికి ఎందుకివ్వాలని అన్నారు.
వచ్చే నెల మొదటి వారంలో పార్టీ విధేయులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. పీసీసీ చీఫ్ మార్పు ఉండదని ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా చెబుతుంటే, మరోవైపు తనకు పదవి కావాలని జగ్గారెడ్డి ఎలా అడుగుతారని అసహనం వ్యక్తం చేశారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పినా వినకుండా ఇచ్చారని, పార్టీ పేరుతో గెలిచిన వారంతా ఇప్పుడు మరో పార్టీలో చేరుతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.