చైనా అధ్యక్షుడు సీ జిన్పింగ్, ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఆధునిక యుగంలో వాస్తవరూపం కల్పించే కార్యాచరణ రూపకల్పనకు ఉ.కొరియాతో చేతులు కలిపేందుకు తాము సిద్ధంగా వున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఉ.కొరియాలో పర్యటిస్తున్న సీ జిన్పింగ్ ప్యాంగ్యాంగ్ చేరుకున్నపుడు అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి ప్రభుత్వ అతిధి గృహంలో భేటీ అయిన ఇరువురు నేతలూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు వాస్తవ రూపం కల్పించే కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై చర్చించారు.
తరువాత సీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఇరుదేశాల మధ్య ఏడు దశాబ్దాల మైత్రిని గుర్తు చేసిన కిమ్ జోంగ్ ఉన్…దీనికి ఇరుదేశాలకు చెందిన పాతతరం నేతలు గట్టి పునాది వేశారన్నారు. అందువల్లే ఇరుదేశాల మధ్య మైత్రి కాలపరీక్షలకు తట్టుకుని పటిష్టంగా నిలిచిందని ఆయన వివరించారు. తనకు సాదర స్వాగతం పలికిన కిమ్జోంగ్ ఉన్, ఉ.కొరియా ప్రజలకు చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రభుత్వం, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేసిన సీ జిన్పింగ్ ఆధునిక యుగంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు వాస్తవ రూపం కల్పించే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చైనా అధ్యక్షుడు సీ జిన్పింగ్ చెప్పారు.
ప్రధానాంశాలపై తమ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావటంతో కిమ్తో తన భేటీ ఫలప్రదమైనట్లు భావిస్తున్నానని ఆయన వివరించారు. సంప్రదాయకమైన తమ మైత్రీబంధాన్ని భావితరాలకు అందించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయని, కాలానుగుణమైన మార్పులతో ఇందులో కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుడతామని చెప్పారు.
ఉ.కొరియా కిమ్ నేతృత్వంలో సోషలిస్టు సమాజ నిర్మాణంలో భారీ విజయాలను నమోదుచేసుకుంటుందని ఆశిస్తున్నామని, ఇందుకు ఉ.కొరియాతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా వుందని ఆయన చెప్పారు. తన పర్యటనలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను అమలు చేసేందుకు ఇరుదేశాలు సమిష్టిగా కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉ.కొరియా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణాన్ని తాము గట్టిగా సమర్ధిస్తున్నామన్న సీ, ఈ వ్యూహాత్మక వైఖరిని అమలు చేయటం ద్వారా కొరియా ద్వీపకల్పంలో అణు సమస్యకు రాజకీయ పరిష్కారం సాధించటంతో పాటు శాంతి, భద్రతలకు పునాది వేస్తామన్నారు. దీనిపై స్పందించిన కిమ్ మాట్లాడుతూ ఉ.కొరియా చైనాలు ఇప్పటికే పరస్పర మద్దతు, సహకారంతో సంప్రదాయ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయన్నారు.
ఆర్థిక వ్యవస్థను జగన్ పట్టించుకోవట్లేదు: యనమల